అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అయిదు శాసన మండలి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అయిదు స్థానాలకు అయిదు నామినేషన్లు దాఖలు అయ్యాయి. శుక్రవారం వాటిని పరిశీలించిన రిటర్నింగ్ అధికారులు.. వాటిని ఆమోదించారు. శాసన సభ్యుల కోటాలో ఈ అయిదు మందీ ఎన్నికయ్యారు. వారిలో నలుగురు అధికార తెలుగుదేశం పార్టీ తరఫున, ఒకరు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు.
ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ఏపీ ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు టీడీపీ నుంచి నామినేషన్లను దాఖలు చేశారు. వైఎస్ఆర్ సీపీ తరఫున జంగా కృష్ణమూర్తి నామినేషన్ వేశారు. గడువు ముగిసే సమయానికి అయిదు నామినేషన్లు దాఖలయ్యాయి. పోటీ అంటూ ఎవరూ లేకపోవడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. త్వరలో వారికి అధికారికంగా ఎన్నిక పత్రాలను అందజేయనున్నారు.

No comments:
Post a Comment