ఆలగడప నల్గొండ న్యూస్టుడే:
ఐదు రోజుల్లో బాజాభజంత్రీలు మోగాల్సిన ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. ఆళ్లగడపకు చెందిన నిమ్మల సోమయ్య(45) తన పెద్ద కుమారుడు నరేశ్కు ఈ నెల 28న వివాహం జరగనుంది. బంధువులను ఆహ్వానించేందుకు పెళ్లి పత్రికలు తీసుకొని శుక్రవారం కోదాడకు వచ్చాడు. తిరిగి మునగాల మండలం ముకుందాపురంలోని బంధువులకు పత్రికలు పంచి తన ద్విచక్రవాహనంపై సూర్యాపేట వైపునకు గుంజలూరు స్టేజీ సమీపంలోకి రాగానే తన వాహనం నుంచి పత్రికలు ఉన్న సంచి తెగిపోయి రహదారిపై పడి పత్రికలు కొన్ని చెల్లాచెదురుగా పడ్డాయి. ద్విచక్రవాహనాన్ని పక్కన పెట్టి రహదారిపై పడిన పత్రికలు ఏరుతున్న క్రమంలో విజయవాడ వైపు నుంచి అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం సోమయ్యను ఢీకొట్టింది.తలకు బలమైన గాయాలై రహదారిపై పడి ఉండగా అటుగా వెళ్తున్న ప్రయాణికులు 108లో సూర్యాపేటకు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెళ్లి పనుల్లో నిమగ్నమైన కుటుంబ పెద్ద సోమయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో స్వగ్రామమైన మిర్యాలగూడ మండలం ఆలగడపలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ పెద్ద అకాల మృతితో బంధువులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
No comments:
Post a Comment