చిత్తూరు న్యూస్టుడే:
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చిత్తూరు జిల్లాలో పోటీ చేయనున్న భాజపా శాసనసభ అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టాలని ఆ పార్టీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.
తిరుపతిలో ఓ ప్రైవేట్ హోటల్లో బుధవారం ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నాయకులతో ఆమె సమావేశమయ్యారు.
ఆమె మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఫారం-బీ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నింపాలని సూచించారు.
ప్రతి అభ్యర్థి ఒక న్యాయవాది, ఆడిటర్ను వెంట పెట్టుకోవాలని తెలిపారు.
అదే విధంగా అసెంబ్లీ ఇన్ఛార్జులను నియమించుకోవాలని, వెంటనే ప్రచారం మొదలు పెట్టాలని ఆదేశించారు.
ఇంటింటికి వెళ్లి కేంద్రప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని సూచించారు. ప్రతి డివిజన్లో బూత్ కమిటీలను తప్పక ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో భాజపా విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశానికి జిల్లాలోని 7గురు ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రమే హాజరుకావడం, మీడియాకు కూడా సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి పొనగంటి భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి, కార్యవర్గ సభ్యుడు గుండాల గోపినాథ్ రెడ్డి, నాయకులు వెంకటముని, జగదీశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment