పశ్చిమ గోదావరి న్యూస్టుడే: అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రజాశాంతి పార్టీ గుర్తును ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ వ్యవస్థాపకుడు కె.ఎ.పాల్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని గుణ్ణం ఫంక్షన్ ప్లాజాలో పాస్టర్లు, నాయకుల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఇతర పార్టీలు ఇచ్చే సొమ్ములను తీసుకుని.. ఓటు మాత్రం ప్రజాశాంతి పార్టీకి వేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నట్లు పాల్ ప్రకటించారు. ఈనెల 22న నామినేషన్ వేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున విశ్వాసులు నామినేషన్ కార్యక్రమానికి హాజరుకావాలన్నారు. చంద్రబాబు, జగన్, పవన్ మాటలు విని వారికి ఓటు వేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయా నాయకులు తిరిగే హెలీకాప్టర్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే రైతులు, డ్వాక్రా మహిళలకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఉచిత విద్యతోపాటు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక అపోలో ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. 70 ఏళ్ల వయసున్న చంద్రబాబు ఇంక ఇంట్లో కూర్చోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన పాస్టర్లు, పార్టీ నాయకులు, విశ్వాసులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment