Friday, March 15, 2019

బలవన్మరణానికి పాల్పడిన కుటుంబం……

ప్రకాశం జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధకు తాళలేక కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని కొమరోలు మండలం అల్లినగరంలో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జక్కా రాఘవేంద్ర నాగరాజు(45) బెంగళూరులోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు స్థానికంగా ఓ దుకాణం నిర్వహిస్తూ జీవిస్తున్నారు.
 అయితే, చేసిన అప్పులు పీకల మీదకు వచ్చి పెను భారంగా మారడంతో ఏం చేయాలో పాలుపోని కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో రాఘవేంద్ర, ఆయన భార్య ఈశ్వరి (35), కుమార్తె వైష్ణవి (13) ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో అమ్మాయి వరలక్ష్మి (10) ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment